హైదరాబాద్ కు కరోనా టీకా... వచ్చేసింది
కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్కు వచ్చేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు మంగళవారం ఇక్కడికి చేరుకున్నాయి. పుణె నుంచి స్పెషల్ కార్గో ఫ్లైట్లో 31 బాక్సుల్లో వ్యాక్సిన్ డోసులను పంపగా.. మధ్యాహ్నం 12:05 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో రాష్ట్ర వైద్య అధికారులు రిిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఇన్సులేటర్ వెహికల్లో కోఠిలోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ సెంటర్కు తరలించారు. వెహికల్ ముందు, వెనకా పోలీసు ఎస్కార్ట్ పెట్టారు. మధ్యాహ్నం 12:55 గంటలకు డ్రగ్ స్టోరేజీ సెంటర్ వద్దకు చేరుకున్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సుధీర తదితరులు.. వ్యాక్సిన్ బాక్సులకు ప్రత్యేక పూజలు చేసి, స్టోరేజీ సెంటర్లోకి తరలించారు. వాకిన్ ఫ్రీజర్లో భద్రపరిచి.. పోలీసు సెక్యూరిటీ పెట్టారు.
ఒక్కో బాక్సులో పంన్నెండు వేల డోసులు.....
రాష్ట్రంలో మొదటి దశలో 3 లక్షల 40 వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వ్యాక్సినేషన్ మొదలయ్యే సరికి ఇంకో 40 వేల మంది రిజిస్టర్ చేసుకుంటారని హెల్త్ డిపార్ట్మెంట్ అంచనా వేసి చెపుతుంది. ఇందుకు అనుగుణంగా పది శాతం వేస్టేజీతో కలిపి 3.64 లక్షల డోసులను కేంద్రం రాష్ట్రానికి పంపింది. మొత్తం 31 బాక్సులురాగా.. ఒక్కో బాక్సులో 12 వందల వయల్స్ ఉన్నాయి. ఒక్కో వయల్లో పది డోసుల వ్యాక్సిన్ ఉంటుందని బాక్సుపై ముద్రించారు. ఒక్కో డోసు అర మిల్లీలీటరు (0.5 ఎంఎల్) ఉంటుంది. తొలి డోసు ఇచ్చిన నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. నవంబర్ ఒకటో తేదీన ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ను రాష్ట్రానికి పంపించారు. దీని వ్యాలిడిటీ ఆర్నెళ్లు. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఎక్స్పైరీ తేదీ ఉంది. అయితే వారం రోజుల్లోనే ఈ వ్యాక్సిన్ను వినియోగించనున్నారు. రెండో డోసుకు అవసరమైన వ్యాక్సిన్లను త్వరలోనే రాష్ట్రానికి పంపనున్నారు.