పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి పనులను తనిఖీచేసిన మంత్రి కె.టి.ఆర్, మేయర్ బొంతు రామ్మోహన్
50శాతం పూర్తి అయిన పనులు - మరో నెలరోజుల్లో అందుబాటులోకి రానున్న స్టీల్ బ్రిడ్జి
23 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్లతో కలిసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు కేటిఆర్. రోడ్డు విస్తరణ చేసి నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్ల అమర్చే పనులను పరిశీలించారు. లాక్డౌన్ వలన కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులను, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ, ఆధునిక యంత్రాలతో మరో నెలరోజులలో పనులను పూర్తిచేయాలని తెలిపారు. స్టీల్ బ్రిడ్జి, రెండు వైపులా రెండు లేన్ల విస్తరణ పనులు 50శాతం పూర్తి అయినట్లు జిహెచ్ఎంసి ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ మంత్రికి వివరించారు. నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట మార్గంలో ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులు మరో నెల రోజుల్లో పూర్తిగా తొలగిపోనున్నాయి.