శంషాభాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో రైల్..

హైదరాబాద్ కు మరో తలమానికం- ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టు 

ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయనున్న సిఎం కెసిఆర్

మూడు సంవత్సరాలలో పూర్తికానున్న ప్రాజెక్టు

                 మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల  రాయదుర్గం మెట్రో టర్మినల్  నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోకారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా డిసెంబర్ 9 న సిఎం కెసిఆర్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కు శంఖుస్థాపన చేయనున్నారు. రానున్న మూడు సంవత్సరాలల్లో  మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.  ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్నదని సిఎం తెలిపారు

                  ఈ మెట్రో.. వయా, బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్ రామ్ గూడ జంక్షన్ ను తాకుతూ వెలుతుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా   మెట్రో రైలు నడుస్తుంది.  మొత్తం 31 కిలో మీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టు ను  6,250 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి.

 

                     విశ్వ నగరం గా మారిన హైదరాబాద్ నగర భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చిదిద్దుతూ, నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి  అతి తక్కువ సమయంలో చేరుకునేలా మెట్రో ప్రాజెక్టులో ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ హై వే  ని రూపకల్పన చేసింది ప్రభుత్వం. ప్రపంచంలోని ప్రముఖ మెట్రో నగరాలన్నింటిలోనూ కూడా ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో వున్న   ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న కెసిఆర్ గారి దార్శనికత  నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణలతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టుకి రూపకల్పన చేసిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మెట్రోను విమానాశ్రయం వరకు అనుసంధానించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. మెట్రో ప్రాజెక్ట్ వలన మరిన్ని పెట్టుబడులకు హైదరాబాద్ గమ్య స్థానం గా మారబోతున్నది.

                   హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీని తట్టుకునే ఉద్దేశంతో, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దిశా నిర్దేశంతో మంత్రి కెటిఆర్ కృషితో పెద్ద ఎత్తున రవాణా మౌలిక వసతులను కల్పిస్తున్నది. అనేక ప్రాజెక్టులను, ఫ్లై ఓవర్లను, లింక్ రోడ్లను, ఇతర రహదారి వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది.