మేము కష్టపడుతాము - మీరు సహకరించండి
కరోనా నియంత్రణ లో నిరంతరం శ్రమిస్తున్న శానిటేషన్, ఎంటమాలజి, డి ఆర్ ఎఫ్ సిబ్బందికి సంఘీభావo తెలుపుతూ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయించారు మేయర్ బోంతు రామ్మోహన్. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, సమీక్షిస్తూ, యంత్రాo గానికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసి లో 25 వేలమంది శానిటేషన్, ఎంటమాలజీ, డిఆర్ఎఫ్ సిబ్బంది తమ కుటుంబమును వదిలి, ప్రాణాలకు తెగించి కరోనా నివారణ కు కృషిచేస్తున్నారని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులకు ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తాము, తమ కుటుంబం కంటే సమాజ హితమే ముఖ్యమని సేవాభావంతో వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో తమను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ, ప్రపంచం లోని పలుదేశాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. మన వద్ద అలాంటి పరిస్థితి లేదన్నారు మేయర్. పాజిటివ్ కేసులు వున్నప్పటికీ భయపడకుండా ప్రజల కొరకు జి హెచ్ ఎం సి, పోలీస్, వైద్య శాఖల ఉద్యోగులు, శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజల కొరకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అర్ధం చేసువాలని నగరవాసులకు విజ్నాప్తి చేశారు. కరోనా వైరస్ మీ ఇంటి గడప తొక్కకుండా మేము అందరం పనిచేస్తున్నాం. ఇండ్లలోనే ఉండి, సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా జీతంతో పాటు, రూ 7500/- లను ప్రోత్సాహకంగా ఇస్తున్న ట్లు తెలిపారు.హైదరాబాద్ నగరంలో శానిటేషన్ పరిస్థితి ఇతర నగరాల కంటే మెరుగుగా వున్నదని తెలిపారు. కార్మికుల సేవలను గౌరవిస్తూ, సంఘీభావం ప్రకటించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాదీలందరూ ప్రభుత్వం.., జిహెచ్ఎంసితో సహకరించాలన్నారు మేయర్.