పాపం పసివాళ్లు
-
అగ్నిలో సజీవ దహనం
క్రిస్మస్ పండుగ రోజు అమెరికాలో జరిగిన దుర్ఘటనతో తెలుగు కుంటుంబంలో విషాదఛాయలు నింపింది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో చెలరేగిన మంటలకు సజీవదహనమయ్యారు. కొలిర్విలిలో ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో చిక్కుకుని మొత్తం నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు. మృతుల్ని సాత్వికనాయక్, సుహాస్నాయక్, జయ్సుచితగా గుర్తించారు. వీరంతా 17 ఏళ్లలోపు వయస్సున్న వారే. వీరు నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపుతండాకు చెందినవారు.
-
స్కాలర్ షిప్ తో చదువుకునేందుకు..
ఏడాది క్రితం స్కాలర్షిప్తో చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులు క్రిస్మస్ వేడుకలకు భారత్ వచ్చారు. దీంతో సాత్విక, సుహాస్, జయ్ ముగ్గురూ కొలిర్విలీలోని చర్చిలో ప్రార్థనల అనంతరం తమ కుటుంబ స్నేహితులైన క్యారిక్రూడిట్ ఇంటికి వెళ్లారు. క్యారిక్రూడిట్ ఇంట్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ మంటలకు విద్యార్థులతో పాటు క్యారిక్రూడిట్ కూడా చనిపోయారు. ఈ ప్రమాదంలో క్యారీక్రూడిట్ భర్త, కొడుకుకు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అగ్నిప్రమాదంలో చిక్కుకుని తమ పిల్లలు ముగ్గురూ చనిపోయారన్న వార్త తెలుసుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.