పరమేశ్వర్‌ రెడ్డి కోసం గాలింపు

కడప : వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వై.ఎస్. కుటుంబ సభ్యులను ప్రశ్నించిన పోలీసులు... తాజాగా మరికొందరు అనుమానితులను విచారించేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వై.ఎస్. కుటుంబ సభ్యులకు సన్నిహితుడిగా ఉన్న పరమేశ్వర్ రెడ్డిపై నేర చరిత్ర ఉంది. ఏడాది నుంచి పులివెందులలోనే నివాసం ఉంటున్నాడు. అయితే వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటి రోజు నుంచి ఆయన పులివెందులలో కనిపించడంలేదని పోలీసులు భావిస్తున్నారు.

పరమేశ్వర రెడ్డి కోసం ఆరా తీస్తే తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించడానికి పోలీసులు తిరుపతి వెళ్లినట్లు సమాచారం. 
మరోవైపు ఇప్పటికే 20 మంది సాక్షులను విచారించిన సిట్‌ అధికారులు.. పలువురిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగంగిరెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరమేశ్వర్ రెడ్డి కోసం తిరుపతి వెళ్లారు.