టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో
- ‘చంద్రన్న బీమా’ రూ.10 లక్షలు.. మరో అయిదేళ్లు ‘అన్నదాత సుఖీభవ’
అవగాహన లేకుండా కొన్ని పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయని, కానీ తమ పార్టీ చెప్పిందే చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ఈ రోజు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థిక అసమానతలు తగ్గించేలా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. తాము చెప్పినదాని కంటే 50 శాతం ఎక్కువే చేశామని తెలిపారు. కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారమే జగన్ నడుచుకుంటున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం, నీటి పారుదలపై వైసీపీ మానిఫెస్టోలో ఏమి చెప్పలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 150 శాసన సభ స్థానాలు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ప్రకటించారు.
మేనిఫెస్టోలోని కీలకాంశాలు
వ్యవసాయం అనుబంధ రంగాలు..
* వచ్చే అయిదేళ్లూ అన్నదాత సుఖీభవ పథకం అమలు. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి కౌలు రైతులకూ వర్తింపు.
* రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం.
* రైతులకు ఉచితంగా 12 గంటల పాటు పగటిపూట సరఫరా.
* రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
* గిరిజన రైతులకు విత్తనాలు, తదితర ఇన్పుట్స్ ఐటీడీఏ ద్వారా ఉచితం.
* ఏపీని హార్టీ కల్చర్ హబ్గా మార్చడానికి ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరణ.
* మరో 50 లక్షల ఎకరాలలో సూక్ష్మసేద్య వ్యవస్థల ఏర్పాటు
* ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ వద్ద కొత్తగా కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు
* గోపాలమిత్రల వ్యవస్థను బలోపేతం చేసి ఖాళీలు భర్తీ చేయడం
* ప్రపంచ బ్యాంకు సహాయంతో గ్రామ సమృద్ధి యోజన కింద చిన్నచిన్న ఆహార పరిశ్రమల ఏర్పాటు
* మామిడి, అరటి రైతుల కోసం మ్యాంగో, బనానా బోర్డుల ఏర్పాటు
నీటిపారుదల రంగం
* 2 కోట్ల ఎకరాలకు భూమిని సాగులోకి తేవడం లక్ష్యం.
* 2019లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును పూర్తి చేయడం.
* పోలవరం ద్వారా విశాఖ నగరానికి తాగునీరు.
మహిళా సాధికారత-బాలికల భవిష్యత్తు
* డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కొనసాగింపు
* డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు.
* వడ్డీలేని రుణాల పథకాన్ని కొనసాగిస్తూ అర్హత పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
* మహిళా ఉద్యోగినులకు స్కూటర్ కొనుగోలుకు రాయితీ
* ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు.
* రానున్న అయిదేళ్లలో మహిళలకు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక సహాయం.
* రాష్ట్రంలో 15,358 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం.
పేదరికంపై గెలుపు
* చంద్రన్న భరోసా కింద పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంపు
* వృద్దాప్య పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
* చంద్రన్న బీమా సొమ్ము రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
* చంద్రన్న పెళ్లి కానుక రూ. లక్షకు పెంపు
* ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.20 వేల ఆదాయ కల్పనకు ప్రణాళిక
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం
* ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాలపరిమితి 2033 వరకు పొడిగింపు
* విదేశీ విద్య స్కాలర్షిప్ రూ.25 లక్షలకు పెంపు
* కొత్తగా ఏడు జిల్లాల్లో అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ఏర్పాటు
వెనుకబడిన తరగతుల సంక్షేమం
* ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయంబర్స్మెంట్
* 200 రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు
* ఏపీఐఐసీ ద్వారా కేటాయించే ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో 25 శాతం ప్లాట్లు బీసీలకు
* కళింగ కోమట్లకు కార్పొరేషన్
* స్వయం ఉపాధికి కారు లోన్లపై 25 శాతం రాయితీ
* బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీలకు కార్పొరేషన్ల ద్వారా రూ.లక్ష వరకు రుణాలు
* ఆధునిక టెక్నాలజీతో షాపులు, షోరూంలు పెట్టుకునే బీసీలకు రూ.5 లక్షల వరకు రుణం.
* విదేశీ విద్యాదరణ పథకాన్ని రూ.15 లక్షలకు పెంపు
* ప్రతి చేనేత కుటుంబానికి రూ.4 వేల భృతి ఏటా ఖాతాలో జమ
కాపుల సంక్షేమం
* రానున్న అయిదేళ్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు విధానం ప్రకారం విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు
* రానున్న అయిదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు