ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు
తెలంగాణలో త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి అయ్యింది. మహబూబ్నగర్ - రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 60 మందికిపైగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. రేపు (బుధవారం) నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. టీఆర్ఎస్తో పాటు విపక్ష పార్టీలు సైతం ఈ రెండు స్థానాలను ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రచార హోరును ప్రారంభించాయి. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు.