వైసిపి ఎంఎల్‌సి జంగా కృష్ణమూర్తి కుమార్తె ఇంట్లో చోరీ

గుంటూరు : వైసిపి నేత, ఎంఎల్‌సి జంగా కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్‌ త్రివేణి నివాసంలో చోరీ జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు విద్యానగర్‌ లో త్రివేణి నివాసముంటున్నారు. అమరావతి రోడ్డులో ఉండే ఐడి ఆసుపత్రిలో త్రివేణి వైద్యురాలిగా పని చేస్తున్నారు. త్రివేణి భర్త జనార్థనరెడ్డి ఎన్నికల సందర్భంగా.. గామాలపాడు వెళ్లగా, ఆమె బెంగళూరు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దొంగలు.. ఇంటి వెనుక భాగం నుంచి కిటికీలో చేయిపెట్టి గడియ తీసి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని 12 సవర్ల బంగారు నగలు, రూ.30 వేలు నగదును ఎత్తుకెళ్లారు. బెంగళూరు నుండి నిన్న (ఆదివారం) రాత్రి గుంటూరుకు వచ్చిన డాక్టర్‌ త్రివేణి ఇంటికి చేరుకుని లబోదిబోమన్నారు. చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రంగంలోకి దిగారు.