లిక్కర్ స్కామ్‭లో మరో ఇద్దరు అరెస్టు... ఈడీ

    దేశవ్యాప్తంగా అలజడి రేపిన ఈ స్కామ్ లో మరో ఇద్దరు వ్యక్తులను ఈడీ అరెస్టు చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబును అరెస్టు చేశారు.  వినయ్ బాబు పెర్నాడ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన అధికారులు.. రెండు రోజుల నుంచి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్నారు.ఈ క్రమంలోనే వారిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఏపీ, తెలంగాణకు చెందిన వారుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి. శరత్, వినయ్ బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇది వరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.