భారత్‌కు జర్మనీ నుంచి 23 ఆక్సిజన్ ప్లాంట్లు

   ఆక్సిజన్ కొరత నుంచి గట్టెక్కించడానికి కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జర్మనీ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే 23 ప్లాంట్‌లను ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా మనదేశానికి తీసుకురానున్నారు. వారం రోజుల్లో మనదేశానికి చేరనున్నాయి. ఈ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఒక్కోటి గంటకు 2,400 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం గలవి. ఈ రేటుతో ఒక్కో ప్లాంట్ 20 నుంచి 25 మంది పేషెంట్లకు 24 గంటలపాటు ఆక్సిజన్‌ను అందించగలుగుతాయి. ప్లాంట్‌లతోపాటు కంటెయినర్‌లనూ దేశానికి తేనున్నట్టు తెలిసింది. కరోనా సంకట పరిస్థితుల్లో దేశ ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి త్రివిధ దళాలకు అత్యవసర ఆర్థికపరమైన వెసులుబాటును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన నాలుగు రోజుల్లో ఈ నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు.

23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్‌లను జర్మనీ నుంచి వాయుదళం మనదేశానికి తీసుకురాబోతున్నట్టు రక్షణశాఖ ప్రతినిధి భారత్ భూషణ్ బాబు వెల్లడించారు. వీటిని కరోనా పేషెంట్లకు చికిత్సనందిస్తున్న ఆర్మ్‌డ్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్స్‌లకు తరలిస్తారని వివరించారు. ఈ ప్లాంట్‌లను ఈజీగా ఒక చోట నుంచి మరోచోటకు తరలించే వెసులుబాటు ఉండటం ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కలిసొస్తుందని తెలిపారు. పేపర్ వర్క్ కంప్లీట్‌ కాగానే జర్మనీ నుంచి ఆక్సిజన్ ప్లాంట్‌లను దేశానికి తీసుకురావల్సి ఉందని, అందుకు ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వచ్చినట్టు మరో అధికారి పేర్కొన్నారు. అంతేకాదు, విదేశాల నుంచి మరిన్ని ఆక్సిజన్ ప్లాంట్‌లను సేకరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు.