భరించలేని ఎండలు... తగ్గిపోతున్న మార్కులు

మండే ఎండలకు.. విద్యార్థులకు వచ్చే మార్కులకు సంబంధం ఉంటుందా? వేడి పెరుగుతుంటే మార్కులు తగ్గుతూ పోతాయా? అవుననే అంటోంది ఒక పరిశోధన. భరించలేని ఎండలు విద్యార్థుల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని కొన్ని అమెరికా విశ్వవిద్యాలయాలు తమ పరిశోధనలో తెలిపాయి. ఎండల వల్ల విద్యార్థుల మార్కులు తగ్గుతున్నట్లు వివరించాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ యూనివర్సిటీ, జార్జియా స్టేట్ యూనివర్సిటీ ఈ పరిశోధన చేపట్టాయి. యూఎస్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. అమెరికాలో 2001 నుంచి 2014 మధ్య భిన్న వాతావరణాల్లో కోటి మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు యూనివర్సిటీలు తెలిపాయి. వేడి, ఉక్కపోత వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దక్షిణాదిలో ఎక్కువ

అమెరికాలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు పాఠాలపై శ్రద్ధ పెట్టలేకపోతున్నట్లు పరిశోధనలో తేలింది. వేడి వల్ల ఏకాగ్రత లోపించడం, హోం వర్క్ చేయలేకపోవడం వంటి వాటిని గమనించారు. ఏడాదిలో ఉష్ణోగ్రత 0.55 డిగ్రీలు పెరిగితే విద్యార్థుల మార్కులు ఒక శాతం పడిపోతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలకంటే పైన ఉంటే ఇటువంటి ఫలితాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు, 38 డిగ్రీలు దాటితే విద్యార్థులపై మరింత ప్రతికూల ప్రభావం పడుతోంది.

అల్పాదాయ వర్గాలపై ప్రభావం

మైనారిటీలు, అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థుల్లో ఎండల వల్ల ఎక్కువగా మార్కులు తగ్గుతున్నట్లు పరిశోధకులు గర్తించారు. ఏసీ సౌకర్యం లేకపోవడంతో అటు ఇంట్లో ఇటు పాఠశాలలో ఈ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లజాతీయులు, హిస్పనిక్‌లు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో నివసిస్తుంటారు. అందువల్ల వీరిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రమైన మసాచుసెట్స్‌ విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ చూపుతున్నారు. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అలబామా, మిసిసిప్పీ వంటి దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు వెనుకబడుతున్నట్లు పరిశోధన చెబుతోంది. అయితే ఈ ఉష్ణోగ్రతల అంశానికి ప్రభుత్వాలు, తల్లిదండ్రులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని విద్యావేత్తలు అంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది ఏమిటో తెలుసని, ప్రభుత్వాలు సమస్యపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.