బ్రిటన్ హైకమీషనర్ తో బల్దియాబాస్ బేటి
గ్రేటర్ హైదరాబాద్లో మౌలిక సదుపాయాల అభివృద్ది కార్యక్రమాలకు నిధుల సేకరణకై సాంకేతిక సహకారాన్ని అందించడానికి బ్రిటన్కు చెందిన ఇ.వై-యు.కె సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్లో బ్రిటన్కు చెందిన డిప్యూటి కమిషనర్ హ్యాండ్రూ ఫ్లెమింగ్, ఇ.వై సంస్థ ప్రతినిధులతో నేడు ఉదయం జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో చేపడుతున్న ఎస్.ఆర్.డి.పి, డబుల్ బెడ్రూం తదితర భారీ ప్రాజెక్ట్లకు బాండ్లు, రూపి టర్మ్ లోన్ రూపంలో జిహెచ్ఎంసి నిధులను సేకరిస్తున్న విషయం విదితమే. అయితే జిహెచ్ఎంసి ద్వారా చేపట్టే పథకాలకు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా బాండ్లు, రుణాల పద్దతిలో నిధులను సేకరించేందుకు సాంకేతికపరమైన సహాయాన్ని ఇ.వై సంస్థ ద్వారా అందించేందుకు సిద్దంగా ఉన్నామని బ్రిటీష్ డిప్యూటి హై కమిషనర్ హ్యాండ్రూ ఫ్లెమింగ్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధి బృందం నేడు జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్కు తెలిపింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తగు నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ వారికి స్పష్టం చేశారు.