పాపం పసివాళ్లు...
- వికటించిన వాక్సినేషన్..
- ఒక టాబ్లెట్ కు బదులు మరో టాబ్టెట్ సరఫరా
- 34మంది చిన్నారులు ఆసుపత్రిపాలు
భవిష్యత్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు నెలనెలా ఇప్పించే టీకా ఇప్పించారు. ఆ టీకానే చిన్నారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. హైదరాబాద్ నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది చర్యలతో 34మంది చిన్నారు ఆనారోగ్యం పాలయ్యారు. అభం శుభం ఎరుగని 50రోజుల చిన్నారి మృతికి కారణం అయ్యింది. కన్న తల్లికి గర్భశోకం మిగిల్చింది. మొదటి సంతానం, బిడ్డ పుట్టి కోద్ది నెలలు గడవకముందే ఆ దంపతులు తీరని ఆవేదన అనుభవిస్తున్నారు. పాతబస్తీ కిషన్బాగ్ నజమ్నగర్కు చెందిన అజీమున్నిసా, షేక్ ఇస్మాయిల్ భార్యాభర్తలు. అజీమున్నీసా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీపిల్లలు క్షేమంగా ఉండడంతో నెలనెలా చిన్నారికి టీకాలు వేయించటానికి తీసుకురావాలని చెప్పి వైద్యులు డిశ్చార్జి చేశారు. మొదటి టీకా ఇప్పించటానికి బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వ్యాక్సిన్ వేశారు. రెండు మందు బిళ్లలు ఇచ్చి ఉదయం, సాయంత్రం వేయమని చెప్పి పంపించారు. అబిల్లలే ఆ చిన్నారికి యమపాశాలు అయ్యాయి. చిన్నారి అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు వెంటనే నిలోఫర్కు తీసుకెళ్లమని సూచించాడు. గురువారం ఉదయం నిలోఫర్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఒక చిన్నారి చనిపోయింది. అయితే ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మరో చిన్నారి కూడా మృతి చెందిన్నట్లు సమాచారం.
92 మందికి వ్యాక్సిన్- నాంపల్లి ఆస్పత్రి సూపరింటెండెంట్.
చిన్నారులు అనారోగ్యం బారిన పడిన విషయం తెలియగానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని నాంపల్లి ఏరియా ఆస్పత్రి సూపరింటెడెంట్ డాక్టర్ సునీత అన్నారు. వ్యాక్సిన్ వేసిన రెండు మూడు గంటల తరువాత ఓ వ్యక్తి చిన్నారిని తీసుకొని ఆస్పత్రికి వచ్చాడని, అనారోగ్యంగా ఉండడంతో నిలోఫర్కు పంపించామని చెప్పారు. తర్వాత మరొకరు రాగానే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈనెల 6వ తేదీన మొత్తం 92 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. వారందరికీ ఫోన్ చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామన్నారు. గురువారం మరో 10 మంది చిన్నారులను నిలోఫర్కు పంపించామని, మిగిలిన వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వారి తల్లిదండ్రులు తెలిపారని వివరించారు.
వెంటిలేటర్పై ముగ్గురు చిన్నారులు
బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నిలోఫర్కు 32 మంది చిన్నారులు అనారోగ్యంతో వచ్చారు. వీరిలో ముగ్గురికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు . ట్రెమడాల్ ట్యాబ్లెట్ అధిక మోతాదులో వేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో పిల్లలకు ఇబ్బందులు తలెత్తాయంటున్నారు డాక్టర్లు. ఇలాంటి ట్యాబ్లెట్ల ప్రభావం 24 నుంచి 48 గంటల వరకు ఉంటుంది. యాంటీ డోస్ ఇచ్చామని.., మరో 100 యాంటీ డోస్లను అందుబాటులో ఉంచామన్నారు.
బాద్యులపై చర్యలు తీసుకోవాలి.
పారాసిటమాల్ ట్యాబ్లెట్కు బదులు ట్రెమడాల్ ట్యాబెట్లు ఇచ్చి తమ పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడారని వైద్యులు, సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డలకు ఏమైనా అయితే వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నాపంల్లి ఏరియా ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్ కాకుండా ఇతర సిబ్బంది మందులు ఇచ్చారని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.