పటిష్టంగా కంటైన్మెంట్ల అమలు

 

                       కరోనా వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడ  నియంత్రించేందుకు  కంటోన్మెంట్ పద్దతిని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ తెలిపారు. ఒక పాజిటివ్ కేసు గుర్తించిన  ప్రాంతాన్ని   కూడా  కంటైన్మెంట్ జోన్ గా ప్రభుత్వం  ప్రకటిస్తున్నందున తదనుగుణంగా  బారికేడింగ్, ఇతర చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలని అధికారులకు  స్పష్టం చేశారు.

 

              జి హెచ్ ఎం సి కార్యాలయంలో  నిర్వహించిన సమావేశంలో నగరంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లలో చేపట్టిన  పనుల గురించి  జి హెచ్ ఎం సి కమీషనర్ లోకేష్ కుమార్,అదనపు కమీషనర్ బి సంతోష్,  సి సి పి దేవేందర్ రెడ్డి లతో చర్చించారు. కంటైన్మెంట్ జోన్లలో సర్వేలెన్స్ టీమ్స్  నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే, అనుమానిత కేసులకు ప్రాధమిక నిర్దారణ పరీక్షలు జరిపించుటకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు గురించి వాకబు చేశారు. అలాగే కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలకు నిత్యావసరాలకు  ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలతో జి హెచ్ ఎం సి సిబ్బంది ద్వారా అందించాలని సూచించారు.  కంటైన్మెంట్ జోన్లలో నియమించిన నోడల్ టీమ్, సర్వేలెన్స్ టీమ్స్, సర్కిల్ లెవెల్జో, నల్ లెవెల్ సర్వేలెన్స్ టీమ్స్, ఆయా టీమ్స్ రోజువారీగా నిర్వహిస్తున్న విధులను  చెక్ లిస్ట్ ప్రకారం మానిటరింగ్ చేయాలని అర్వింద్ కుమార్  ఆదేశించారు. 

                 కంటైన్మెంట్ జోన్లలో విధులు నిర్వహిస్తున్న  పారిశుధ్య కార్మికులు,సర్వేలెన్స్ టీమ్స్, క్రిమి సంహారకాలను స్ప్రే చేస్తున్న టీమ్స్ కు రక్షణ పరికరాలు అందజేసినట్లు కమీషనర్ లోకేష్  కుమార్ వివరించారు.  అన్ని విభాగాల  నోడల్ అధికారులతో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు, కంటైన్మెంట్ జోన్ల ఉద్దేశ్యం, కరోనా వైరస్ ను  పూర్తిగా నిర్మూలించుటకు సహకలించాలని, ఇండ్లలోనే వుండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో కరపత్రాలు ముద్రించి, ఇంటింటికి పంపిణీ చేసినట్లు తెలిపారు.మూడు భాషలలో రికార్డు చేయించి ఆటోల ద్వారా ప్లే చేస్తున్నట్లు తెలిపారు.​