నాపై దుష్ప్రచారం

  • డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

​​హైదరాబాద్‌: తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్‌ సతీమణి, వైకాపా నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌరవ పరుస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. డీజీపీని కలిసిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4వ తేదీన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఓ టీవీ ఛానల్‌, సోషల్‌ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కోటి కించపరిచారని ఆమె మండిపడ్డారు. అతనితో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్‌, యాంకర్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు లక్ష్మీపార్వతి తెలిపారు.