చెత్త రవాణాలో  రాంకీ మరో ముందడుగు.

 

చెత్త రవాణాలో  రాంకీ మరో ముందడుగు..

 55 అత్యాధునిక కాంప్యాక్టర్ వాహనాలు ప్రారంభం..

చెత్తసమస్యుకు చెక్ పెడుతాం -  మంత్రి కె.టీ.ఆర్..   

                 మున్సిపల్ వ్యర్థాల నిర్వహణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన విధానాలు దేశంలోని మారేనగరంలో చేపట్టడంలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.   నక్లెస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ వ్యర్థాల సేకరణ,  రవాణా, ట్రీట్మెంట్ లో ప్రపంచంలోనే అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన 55 కాంపాక్టర్ వాహనాలను మంత్రి కె.టీ.ఆర్ ప్రారంభించారు. రాంకీ ఎన్వీరో సంస్థ ఎర్పాటు చేసిన వాహనాలను పరిశీలించి అభినందించారు మంత్రి కేటిఆర్. సంజీవయ్య పార్క్ సమీపంలో ఆధునీకరించి ట్రాన్స్ఫర్ స్టేషన్ ను కూడా మంత్రి ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ డీ.ఎస్. లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఖైరతాబాద్ జోనల్ కమీషనర్ ప్రావీణ్య, అడిషనల్ కమీషనర్ బీ. సంతోష్  తదితరులు హాజరయ్యారు.

 

                 ఈ సందర్బంగా మంత్రి  మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో మరో నెలరోజుల్లో మొత్తం చెత్తను ఈ నూతన ఆధునిక వాహనాల ద్వారా తరలించడం జరుగుతుందని, ఇక నుండి రోడ్లపై చెత్తను తీసుకెళ్లే పాత వాహనాలు, రోడ్లపై చెత్త పడడం, చెత్త వాహనాల నుండి దుర్గంధమైన నీరు కారే సంఘటనలు కనిపించవని స్పష్టంచేశారు.

    స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణా ఏర్పాటు కు రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణ బద్ధులై ఉన్నారని, దీనిలో భాగంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదారాబాద్ నగర వాసులకు 44 లక్షల తడి, పొడి చెత్త డబ్బాలను ఉచితంగా ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా రెండు వేలస్వచ్ఛ ఆటోలను ఉచితంగా అందచేశారని, తద్వారా , హైదరాబాద్ నగరంలో రోజుకు 3000 మెట్రిక్ టన్నుల నుండి దాదాపు ఆరు వేల మెట్రిక్ టన్నులకు చెత్త సేకరణ పరిమాణం పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. హైదారాబాద్ తో పాటు రాష్ట్రంలోని నగరాలు, గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతో పట్టణ  ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టారని తెలియ చేశారు.

                హైదరాబాద్ నగరంలో చెత్త సేకరణ విధానాన్ని వికేంద్రీకరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా నగరంలో దాదాపు 90 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు నగరంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. దీనిలో భాగంగా, పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థకై పెద్ద ఎత్తున ఫ్లయ్ ఓవర్లు, అండర్ పాస్ లు, వంతెనల నిర్మాణం, సి.సి టీవీ ల ఏర్పాటు, నగర ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు లింక్ రోడ్ల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాల రీ-సైక్లింగ్ ప్లాంట్లు, చెత్త నుండి  విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, ట్రాన్స్ఫర్ స్టేషన్ల ఏర్పాటు తదితర ఎన్నో వినూత్న పథకాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామని  తెలియచేసారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, నగరంలో చెత్త తరలింపుకై ఎన్నో ఇబ్బందులున్నాయని అన్నారు. మంత్రి కె.టీ.ఆర్ విజన్ తో ఈ రంగంలో ఎన్నో ఆధునిక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.  ఈ కార్యక్రంలో కార్పొరేటర్లు విజయా రెడ్డి, అరుణ, రాంకీ ఎన్విరో సి.ఈ.ఓ గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.