కొనుగోలు కేంద్రాల్లో రైతులను ప్రొత్సహించాలి...వ్యవసాయ శాఖ మంత్రి

    కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన.. ఇప్పటివరకు 3028 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని చెప్పారు. సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వేయాలని ఆదేశించారు. తూకాల వద్ద పకడ్భంధీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలన్నారు.

నాణ్యతతో ధాన్యం తెచ్చిన రైతులను అభినందించి, ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలోని సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని, రైతులు టార్పాలిన్లను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.