ఇస్రో ఎమిశాట్

శత్రు దేశాల రాడర్లను కనిపెట్టే అత్యాధునిక నిఘా ఉపగ్రహం

ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్) ప్రయోగం విజయవంతం తర్వాత భారత్ చేపట్టిన ఎమిశాట్ ప్రయోగం విజయవంతమైంది.  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ45 స్వదేశీ ఎమిశాట్ (EMISAT) ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. మిగిలిన 28 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - పీఎస్‌ఎల్‌వీ-సీ45 వాహక నౌక మోసుకెళ్లింది. ఈ ప్రయోగం పూర్తి కావడానికి 180 నిమిషాలు అంటే మూడు గంటల సమయం పడుతుంది. 2018 జనవరిలో పీఎస్‌ఎల్‌వీ-సీ40 ప్రయోగం పూర్తికావడానికి 2 గంటల 21 నిమిషాలు పట్టింది.

  • వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
  • రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?

పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం ఆసక్తికర అంశాలు

షార్‌లో చేపడుతున్న 71వ ప్రయోగం ఇది.

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 47వది.

తొలి PSLV-QL ప్రయోగం

2019లో ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది.
 

  • శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి మనిషిని పంపడానికి భారత్ సిద్ధంగా ఉందా?
  • అంగారకుడిపైకి హెలికాప్టర్ పంపనున్న నాసా

'ఎమిశాట్': శత్రు రాడార్ల ఆట కట్టు

ఈ ప్రయోగంలో ఎమిశాట్ ప్రధాన ఉపగ్రహం. దీని బరువు 436 కిలోలు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించిన 17 నిమిషాల తర్వాత దీన్ని 749 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. శత్రు దేశాల రాడార్లు, సెన్సర్లను గుర్తించేందుకు ఎమిశాట్ ఉపయోగపడుతుంది. ఇలాంటి శాటిలైట్‌ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. శత్రు దేశాల రాడార్లను పసిగట్టడానికి, దానికి తగ్గట్టుగా దేశ భద్రతకు చర్యలు తీసుకునేందుకు భారత్‌కు అవకాశం కలుగుతుంది. ఎమిశాట్‌ని కక్ష్యలో ప్రవేశపెట్టిన సుమారు గంట తర్వాత ఇతర దేశాలకు చెందిన మరో 28 శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెడతారు. వీటిలో 24 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవే. 20 ఫ్లాక్ 4ఏ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్లు, నాలుగు లేమూర్ శాటిలైట్లు ఉన్నాయి. నౌకల కదలికను గుర్తించడంలో ఇవి సహాయం చేస్తాయి. మిగిలిన నాలుగు ఉపగ్రహాలు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్‌కి చెందినవి.
 

  • ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
  • అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?

29 ఉపగ్రహాలు.. మూడు కక్ష్యలు

పీఎస్‌ఎల్‌వీ-సీ45 మొత్తం 29 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది. ప్రధాన శాటిలైట్‌ ఎమిశాట్‌ను మొదట భూమికి 749 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. తర్వాత ఇంజిన్‌ను రెండుసార్లు రీస్టార్ట్ చేసి, పీఎస్‌ఎల్‌వీని 504 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకొచ్చి అక్కడ విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. అనంతరం మరోసారి రీస్టార్ట్ చేసి పీఎస్‌ఎల్‌వీని 485 కిలోమీటర్ల ఆర్బిట్‌లోకి తీసుకొస్తారు. ఈ దశలో స్పేస్ బార్న్ ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. నాలుగు స్ట్రాప్ ఆన్ మోటర్లతో తొలిసారిగా పీఎస్‌ఎల్‌వీ QL వెరియంట్‌ను ఉపయోగిస్తున్నారు. గతంలో రెండు, ఆరు స్ట్రాప్ ఆన్ మోటర్లతో పీఎస్‌ఎల్‌వీని ప్రయోగించారు. స్ట్రాప్ ఆన్ మోటర్లు లేకుండా కూడా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించారు. కక్ష్యలో విద్యుత్ కోసం పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశలో తొలిసారిగా సోలార్‌ పలకలు ఉపయోగిస్తున్నారు.

  • ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ

ఒక ప్రయోగం.. 104 ఉపగ్రహాలు

గతంలో 'పీఎస్ఎల్‌వీ-సీ37' రాకెట్ రికార్డు స్థాయిలో ఏకంగా 104 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట - సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 15న ఈ ప్రయోగం చోటు చేసుకుంది. అంతరిక్షంలోని వివిధ కక్ష్యల్లోకి విజయవంతంగా చేరిన 104 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్‌కు చెందినవి. మిగతా 101 ఉపగ్రహాలూ విదేశాలకు చెందినవే.